హైదరాబాద్, రైతుముచ్చట: వ్యవసాయరంగంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంగళవారం రోజు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది.
ఆహారం లేనిది జీవరాశి మనుగడ లేదని, ఆహారానికి మరొక ప్రత్యామ్నాయమే లేదని, అమెరికాలో అత్యధిక సాగుభూమి ఉన్నా వ్యవసాయం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని, చైనాలో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తి ఉన్నా అవి ఆ దేశ అవసరాలకే సరిపోతున్నాయని, కేవలం సిల్క్ మాత్రమే ఆ దేశం ఎగుమతి చేస్తుందని, మన దేశంలో వ్యవసాయ అభివృద్దికి పుష్కల వనరులు, నైపుణ్యం గల రైతులు ఉన్నారని, రాబోయే తరాలను వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాల వైపు నడిపించాలని, దేశంలో అత్యధిక శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగం మాత్రమే అని మంత్రులు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక కృషి చేస్తుందని, రాష్ట్రంలో వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలని, ఇందుకోసం ఏ విధమైన కార్యాచరణ చేయాలో గుర్తించాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది.
మంత్రి వర్గ ఉపసంఘం చర్చించిన ఇతర ముఖ్య విషయాలు :
తెలంగాణలో పండే ఆప్లాటాక్సిన్ రహిత వేరుశెనగకు ప్రపంచమార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది
నూతన వేరుశెనగ వంగడాలను కనుగొనేందుకు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు చర్యలు
వరి ధాన్యం నుండి ఇథనాల్ గా మార్చే పరిశ్రమలను ఏర్పాటు చేసే విషయంపై పరిశీలించాలి
తెలంగాణలో 35 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత కరంటు
స్థానికంగా విత్తన లభ్యత ఉంటే ఆలుగడ్డ సాగును తెలంగాణలో విస్తృతంగా పెంచుకోవచ్చు
తెలంగాణ వచ్చేనాటికి వ్యవసాయ ఉత్పత్తుల విలువ రూ.40 వేల కోట్లు
నేడు ఆ ఉత్పత్తుల విలువ రూ.94,500 వేల కోట్లు కావడం ఆనందదాయకం
సమస్త సమాచారం లభించేలా రైతు సమీకృత కేంద్రాలుగా రైతువేదికలు నిలవాలి
అగ్రి స్టార్టప్ లను ప్రోత్సహించాలి
సహకారరంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది
దాదాపు 150 సహకారసంఘాలు రాష్ట్రంలో చురుకుగా పనిచేస్తున్నాయి
వ్యవసాయరంగంపై జరిగిన ఈ మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రులు ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వీసీలు ప్రవీణ్ రావు, నీరజా ప్రభాకర్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అగ్రోస్ ఎండీ రాములు పాల్గొన్నారు.