పంటల నమోదు పక్కాగా జరగాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్, రైతుముచ్చట: హైదరాబాద్ లోని వ్యవసాయ కమీషనరేట్ లో వానాకాలం పంటల విస్తీర్ణం, పంటల సరళి మరియు రాబోయే ధాన్యం కొనుగోళ్లుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ, TSSDC, TSSOCA, AGROS, FCI, PJTSAU ల నుంచి ఉన్నత అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.

ఈ సారి వందశాతం ఖచ్చితత్వంతో కూడిన పంటల నమోదు పక్కాగా జరగాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో ధరణిలో సర్వే నంబర్ల వారీ మ్యాపుల ఆధారంగా పంటల నమోదు చేయాలని, ఆగస్ట్ 15 నుండి ప్రారంభమయిన పంటల నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఉన్నతాధికారులు వెంటనే జిల్లాలలో పర్యటించాలని, తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వ్యవసాయ అధికారులకు ఇతర పనులు అప్పజెప్పవద్దని, మరో పది రోజులలో పంటల నమోదు సంపూర్ణంగా పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.

యాసంగిలో ఆరుతడి పంటలైన వేరుశెనగ మరియు ఇతర నూనెగింజల పంటలైన ఆవాలు, నువ్వులు, కుసుమ, పొద్దు తిరుగుడు వంటి పంటలతో పాటు పప్పుశనగను ప్రోత్సహించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ సమావేశం సంధర్భంగా సూచించారు.

ఆదేవిధంగా, వచ్చే యాసంగిలో నూనెగింజలను ప్రోత్సహించడంలో భాగంగా వేరుశెనగ సాగును పెంచడానికి రాయితీపై విత్తనాలను సరఫరా చేయడానికి గల అవకాశాలను అధికారులు వెంటనే పరిశీలించి ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA