- సమగ్ర వ్యవసాయ పద్దతిపై ప్రత్యేక దృష్టి సాదిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాలు
- దేశవ్యాప్తంగా మోడల్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ఫామ్స్ ను గుర్తించిన ICAR-KVK
- గుమ్మకొండకు చెందిన యువ రైతు పొలం గుర్తింపు
- సమగ్ర వ్యవసాయ పద్దతిలో వివిధ రకాల పంటల సాగు
- దాదాపు 300 రకాల దేశవాళీ వరి వెరైటీల విత్తనోత్పత్తి
- పూర్తిగా ఆర్గానిక్ పద్దతిలో పంటల సాగు
- రాబోయే రోజుల్లో ఫిష్ పాండ్ ఏర్పాటుకు ఆలోచన
జాతీయం, రైతుముచ్చట: దేశ వ్యాప్తంగా రాను రాను భూ కమత పరిమాణం తగ్గిపోవటం భవిష్యత్ వ్యవసాయ రంగానికి అతిపెద్ద సవాలుగా మారనున్నది. ఈ నేపథ్యంలో రైతు తనకున్న క్రొద్ది పాటి పొలాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని “సమగ్ర వ్యవసాయ పద్దతిలో” (Integrated Farming System) పంటల సాగు చేసే విధానాల పైన దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రత్యేక దృష్టి సాధించాయి.
ఈ క్రమంలోనే రాష్ట్రాల వారీగా ఉత్తమ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మోడల్స్ ను గుర్తించి వాటిని ఆదర్శంగా తీసుకొనే విధంగా ఇతర రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా భారత కృషి విజ్ఞాన కేంద్రం వారు నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండలం, గుమ్మకొండ గ్రామానికి చెందిన బైరపాగ రాజు అనే 32 సంవత్సరాల యువ రైతు యొక్క మోడల్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ఫామ్ ను గుర్తించారు.
ఈ రైతు తనకున్న పొలంలో ఒక హెక్టార్ లో (2.5 ఎకరాలు) సమగ్ర వ్యవసాయ పద్దతిలో పంటల సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిస్తున్నాడు. అతని పొలంలో మొత్తం 5 విభాగాల క్రింద, 0.78 హెక్టార్లో వరి, తెల్ల జొన్న, పచ్చ జొన్న, వేరుశనగ, కంది, చిరుధాన్య పంటలను, 0.14 హెక్టార్లో పూలు, పండ్లు, కూరగాయ పంటలను, పొలం బార్డర్స్ లో మునగ చెట్లను సాగు చేస్తూ, 20 కోళ్ళు, 2 గేదెలను, 11 గొర్రెలను పెంచుతున్నాడు.
అంతేకాకుండా దాదాపు 300 రకాల దేశవాళీ వరి వెరైటీల విత్తనోత్పత్తి చేస్తూ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఇతర రైతులకు సరఫరా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ మొత్తం పంటలను ఆర్గానిక్ పద్దతిలో సాగు చేయటం మరొక గుర్తించదగ్గ విషయం. దీనితో పాటు వచ్చే సంవత్సరం చేపల పెంపకం కోసం ఫిష్ పాండ్ ఏర్పాటు చేయటానికి కూడా ఆలోచిస్తున్నానని రైతు బైరపాగ రాజు తెలిపారు.